మంగళగిరిలో జనసేన పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అభివృద్ధి పక్కన బెట్టి అధికార మదంతో ఊగిపోతున్నారన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఏదో చేస్తారని నమ్మి 2019 ఎన్నికల్లో 151 స్థానాలను కల్పించారని పవన్ గుర్తుచేశారు. ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవడితో పడితే వాడితో ఇష్టమొచ్చినట్లు తిడితే ఇక నుంచి సహించబోమని పవన్ అన్నారు.
దీంతో పాటు అభివృద్ధిని 40 శాతం మందికి అందిస్తే మిగత 60 శాతం మంది చేతులు మూడ్చుకుని కూర్చోవాలా అంటూ కూడా ప్రశ్నించారు. ఇక ఇదే కాకుండా రాబోయే కాలంలో జనసేన పార్టీ మరింత వ్యూహాత్మకమైన అడుగులతో ముందుకెళ్తుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటో అనుభవం ఉండేలా తెలియజేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. బాధ్యత తీసుకున్న కాబట్టి సమస్యల నుంచి పారిపోయే వ్యక్తిని కానని, దేశ అధినాయకులకు వైసీపీ చేస్తున్న అక్రమాల పట్ల ఢిల్లీ వెళ్లిన ప్రతీ సారి తెలియజేస్తున్నానన్నారు. ఇక మరికొన్ని రోజుల్లోనే వైసీపీ దుష్టపాలనను అంతమొందించేందుకు అన్ని ప్రయత్నాల్లో ఉన్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.