న్యూ ఢిల్లీ- భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. జాతీయ పార్టీ బీజేపీలో ఆయన చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే లక్ష్మణ్ తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరికకు కేంద్ర హోమంత్రి అమిత్షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ, క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించిందట. బీజేపీలో చేరేందుకు లక్ష్మణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.
లక్ష్మణ్ చేరికపై త్వరలోనే బీజేపీ అధికారిక ప్రకటన చేయనుందట. గ్రేటర్ హైదరాబాద్ లోని ఓ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. 2012లో అంతర్జాతీయ క్రికెట్ కు లక్ష్మణ్ వీడ్కోలు పలికారు. ఆ తర్వాత ఐపీఎల్ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్ గా ఉన్నారు.
ఇదే సమయంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ వ్యాఖ్యాతగా దుబాయ్లో వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారు.మరోవైపు ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు క్రికెటర్లు బీజేపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి మరి కొంత మంది క్రీడాకారులను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.