రాష్ట్రంలోని వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలు ఖరారయ్యాయి. అత్యధికంగా ఎకరం విలువను 24.22 కోట్ల రూపాయలుగా పెంచింది ప్రభుత్వం. గతంలో దీని విలువ 22.02 కోట్ల రూపాయలుగా ఉండగా.. తాజా నిర్ణయంతో అది కాస్త 24.22 కోట్లకు చేరింది. ఇంత ధర ఎక్కడంటే.. హైదరాబాద్ లోని సరూర్ నగర్, బహదూర్ పురా మండలాల్లో ఎకరం భూమికి ఇంత భారీ ధర నిర్ణయించారు. ఆ తర్వాత స్థానంలో హైదర్నగర్, కూకట్పల్లి, బాలానగర్, మూసాపేట్ మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఎకరం రూ.18.87 కోట్లు, కర్మన్ఘాట్లో రూ. 13.55 కోట్లు, మాదాపూర్లో రూ. 12.58 కోట్లు ఉండగా.. ఈ విలువను 10 శాతం పెంచారు.
ఆ తర్వాత గచ్చిబౌలి, మియాపూర్, నానక్రాంగూడ లో రూ.9.43 కోట్లు, నిజాంపేట, అత్తాపూర్లో రూ.6.29 కోట్లు, నాగోల్ బండ్లగూడలో రూ. 5.03 కోట్లుగా ఉన్న విలువను 20 శాతం పెంచారు. కాగా సాగు, సాగేతర భూముల విలువలన్నిటినీ శనివారం జిల్లాల్లో జరిగే కమిటీలు ఆమోదించనున్నాయి.