ప్రతి సోదరుడు అక్కను అమ్మకు ప్రతిరూపంగా భావిస్తాడు. అలానే ప్రతి సోదరి… తండ్రికి ప్రతి రూపంగా అన్నను భావిస్తుంది. అలా సోదరసోదరిమణుల మధ్య ఎంతో అప్యాయత ఉంటుంది. అలానే ఓ యువతికి తాను పుట్టిన తర్వాత 12 ఏళ్లకు తమ్ముడు పుట్టాడు. ఆ అక్క తమ్ముడ్ని అల్లారి ముద్దుగా పెంచింది. వారిద్దరికి ఒకరంటే మరొకరికి ప్రాణం. అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించే అక్కకు పెళ్లి అయ్యి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తాజాగా రాఖీ పండుగకు తమ్ముడికి రాఖీ కట్టడానికి ఇంటికి వచ్చింది. అక్కకు జీవితాంతం గుర్తు ఉండేలా ఓ బహుమతి ఇవ్వాలని తమ్ముడు భావించాడు. చిన్నప్పటి నుంచి తాను దాచుకున్న ప్యాకెట్ మనీని అక్కకు తులా భారంలా వేసి ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్ర ఖమ్మంలోని రోటరీ నగర్ కాలనీలో నివాసం ఉండే బొలగానీ బస్వనారాయణ, అరుణ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి కుమార్తె పేరు రణశ్రీ. ఆమె పుట్టిన 12 ఏళ్ల తర్వాత తమ్ముడు త్రీవేది పుట్టాడు. అక్కకు తమ్ముడు అంటే చాలా ఇష్టం. అమ్మచూసుకున్నంత ప్రేమగా చూసుకునేది. త్రివేది కూడా అక్క అంటే చాలా ఇష్టం. అలా వారు పెరిగి పెద్దయ్యారు. ఇటీవల రణశ్రీకి వివాహం అయ్యింది. హైదరాబాద్ లో నివాసం ఉంటుంది.అక్క పెళ్లి తరువాత తొలిసారి రాఖీ పండుగకు ఖమ్మం వచ్చింది. ఈ క్రమంలో తన అక్కకు జీవితాంతం గుర్తుండి పోయేలా బహుమానం త్రివేది ఇవ్వాలనుకున్నాడు. తాను దాచుకున్న పాకెట్ 56వేల రూపాయలను 5రూపాయల బిల్లలుగా మార్చాడు. బంధు మిత్రులను పిలిచి అక్కకు తులాభారం నిర్వహించాడు.
అక్క బరువుతో సమానంగా రూ.5 బిల్లలు తూకం వేశాడు. ఇలా అక్కపై తనకున్న ప్రేమను చూపించాడు. తమ్ముడు చూపించిన ప్రేమకు అక్క ఎంతో మురిసి పోయింది. తమ్ముని బహుమతి జీవితాంతం గుర్తుండిపోయేలా ఉందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ వేడుకను చూడటానికి వచ్చిన బంధువులు సైతం ఆ తమ్ముడిని అభినందించారు. ప్రేమ వెలకట్టలేనిదని, అది ఏ రూపంలో ఇచ్చిన సంతోషమే అని రణశ్రీ తెలిపింది. అక్కపై ఈ రకంగా ప్రేమ చూపిన ఈ యువకుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.