హైదరాబాద్- తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారు. అర్హులైన పేదలందరికి రేషన్ కార్డుల జారీ ప్రక్రియను సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3.09 లక్షల మంది లబ్ధిదారులను కొత్తగా గుర్తించారు.
కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన వారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జూన్ నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య 4,46,169 ఉండగా, వీరిలో అనర్హులను తొలగించారు. డూప్లికేట్లు లేకుండా, ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి అన్ని కోణాల నుంచి పరిశీలించారు. వారు వివిధ అంశాల్లో పరిశీలించిన తర్వాత 3,09,083 మందిని అర్హులుగా గుర్తించారు.
కొత్త రేషన్ కార్డుల జారీలో అత్యధికంగా హైదరాబాద్లో 56,064 మందిని అర్హులు ఉండగా, రంగారెడ్డిలో 35,488 మందిని, మేడ్చల్లో 30,055 మందిని అర్హులుగా గుర్తించారు. ఇక కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందజేయనున్నారు. ఈమేరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.