పోలీసు కొలువుల భర్తీకి సంబంధించి తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షల్లో మల్టిపుల్ ఆన్సర్ కశ్వన్స్కు సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కులు కలపాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థులందరికి మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో మార్కులు కలిపిన వాళ్లలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.
ఏడు మార్కులు కలిసిన తర్వాత ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు నియామక బోర్డు తెలిపింది. క్వాలిఫై అయిన అభ్యర్థులు.. వారి పాత లాగిన్ నెంబర్లతో ఈనెల 30 నుంచి వెబ్సైట్లో లాగిన్ అయ్యి పార్ట్-2 అప్లికేషన్ ఫిల్ చేయాలని వెల్లడించారు. అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల అప్లికేషన్ సబ్మిట్ చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. వీటిని నింపేందుకు ఫిబ్రవరి 1 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఫిజికల్ టెస్టు పూర్తి చేసిన వారు మళ్లీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
కాగా ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై కానీ వారి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బోర్డు తెలిపింది. మార్కులు కలపడం వల్ల ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు నియామక బోర్డు స్పష్టం చేసింది. ఇక ఈవెంట్స్కు సంబంధించి అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 8 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఇక అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ విషయంలో ఏవైన ఇబ్బందులు ఎదురైతే.. 9393711110, 9391005006 నంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు.