టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్కు సీఎం కేసీఆర్ తీపి కబురు వినిపించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యోగులకు మరో డీఏ ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. జూన్ నెల శాలరీతో కలిపి డీఏను చెల్లించనుంది. ఎంప్లాయీస్కు డీఏ ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ గురువారం ప్రకటించారు. జూలై నెల, 2022లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నామని తెలిపారు. జూన్ నెల జీతంతో కలిపి ఉద్యోగులకు డీఏను సంస్థ చెల్లిస్తుందని వెల్లడించారు.
ఇకపోతే, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. సకల జనుల సమ్మెలో వారు ముఖ్య భూమిక పోషించారు. 2011లో సుమారు 29 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెలో పాల్గొని.. ప్రత్యేక తెలంగాణ పోరాటం ఊపందుకోవడంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ తమ వంతు కృషి చేశారు. అందుకే, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గిఫ్ట్ కింద పెండింగ్లో ఉన్న ఏడో డీఏను కూడా ఎంప్లాయీస్కు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇప్పటిదాకా ఏడు డీఏలను మంజూరు చేశామని.. మిగిలిన ఆ ఒక్క డీఏను కూడా త్వరలోనే ఉద్యోగులకు అందించనున్నామని వీసీ సజ్జనార్ తెలిపారు.