ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు, ఎలాంటి ఘటనలు జరుగుతాయో ఊహించడం చాలా కష్టం. ఇక్కడ పొలిటికల్ ఫైట్ కాస్త టైట్ గా ఉండటంతో జరిగే ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన పరిస్థితిలు తలెత్తుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో ఒక ఆకతాయి చేసిన పని రాష్ట్ర వ్యాప్తంగా చర్చకి కారణం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో పామూరు బస్టాండ్ సెంటర్లో ఓ యువకుడు ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో బస్సు పాక్షికంగా కాలిపోయింది. చుట్టూ ఉన్న జనం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ యువకుడుని అదుపులోకి తీసుకున్నారు.
బస్సుకి నిప్పు అంటించింది యువకుడు.. వెలిగండ్ల మండలం మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలుగా పోలీసుల తమ విచారణలో తేలింది. పెరిగిన పెట్రోల్, డీజిల్, బంగారం, వెండి ధరలకు నిరసనగా బస్సుకు నిప్పంటించానని, ధరలు తగ్గేందుకు అందరూ పూజలు చేయాలంటూ ఏడుకొండలు విచారణలో చెప్పడంతో పోలీసులు సైతం బిత్తరపోయారు. ఇక ఏడుకొండలను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో అతను సీఎం జగన్ మోహన్ రెడ్డిని దుర్భాషలాడటం, అతను ధరించిన టీ షర్ట్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బొమ్మ ఉండటంతో ఇతను పవన్ కళ్యాణ్ అభిమాన అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ఏడుకొండలు మాట తీరు చూస్తుంటే అతని మానసిక ప్రవర్తనపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.