బెంగళూరు- కర్ణాటక ప్రభుత్వం కీలక చట్టాన్ని తీసుకువస్తోంది. దీంతో ఇకపై కర్ణాటక రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడి చట్టరిత్యా నేరం. ఈ మేరకు బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం మతమార్పిడి నిరోధక బిల్లు 2021ని సోమవారం ఆమోదించింది. కర్ణాటక మంత్రివర్గ ఆమోదం పొందిన ఈ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కర్ణాటకలో మతమార్పిడి నిరోధక బిల్లు ఉత్తర్ ప్రదేశ్ లో మతమార్పిడి చట్టన్ని అనుసరించి రూపొందించారు.
ఈ నూతన చట్టం మత మార్పిడిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తుంది. బలవంతపు మతమార్పిడి చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక లక్ష రూపాయల జరిమానాను విధించనున్నట్టు చట్టంలో స్పష్టం చేశారు. కర్ణాటకకు చెందిన లా కమిషన్ ఈ అంశంపై దేశంలోని పలు చట్టాలను అధ్యయనం చేసి, రాష్ట్రంలోని పరిస్థితులను పరిశీలించి నివేదికను అందించింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా చట్టం రూపొందించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
ప్రధానంగా పేదలను ప్రలోభపెట్టడం ద్వారా మత మార్పిడికి తలొగ్గేలా మారుస్తున్నారని సీనియర్ మంత్రులు చెప్పారు. ఈ నేపథ్యంలో బిల్లులో పలు అంశాలను స్పష్టంగా చేర్చారు. ఈ చట్టం.. తప్పుడు, బలవంతం, మోసం, మితిమీరిన ప్రభావం, బలవంతం, ఆకర్షణ లేదా వివాహం ద్వారా ఒక మతం నుంచి మరొక మతంలోకి మారడాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. బాధిత వ్యక్తి, తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి లేదా రక్తం, వివాహం లేదా దత్తతకు సంబంధించిన ఇతర వ్యక్తులు ఎవరైనా అలాంటి చర్యకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది.
ఐతే తమకు తామే మార్చుకుని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అటువంటి మార్పిడులను పట్టించుకోవలసిన అవసర్లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బలవంతపు, మోసపూరిత మార్పిడిలపై మాత్రమే కఠినంగా వ్యవహరించేలా మత మార్పిడి నిరోధక చట్టాన్ని పటిష్టంగా రూపొందించామని కర్ణాటక సర్కార్ పేర్కొంది.