కొందరు వైద్యుల నిర్లక్ష్యానికి ఎందరో అమాయకులు బలవుతున్నారు. వైద్యం కోసం వచ్చిన వారి పట్ల కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. తాజాగా మరొక ఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందారు. ఒకే ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతితో మలక్ పేట్ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నాగర్ కర్నూలు జిల్లా వెల్డండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన మహేశ్ కి సిరివెన్నెల(23) అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. మహేశ్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సిరివెన్నెల ఇటీవల కాన్పు కోసం మలక్ పేట్ ప్రాంతీయా ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు ఆపరేషన్ చేసి కాన్పు చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వెన్నెల తీవ్ర అస్వస్థకు గురైంది. దీంతో వైద్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలోనే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిరివెన్నెల ప్రాణాలు కోల్పోయింది. మలక్ పేట్ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలోనే మలక్ పేట్ ఏరియా ఆసుపత్రిలో మరొక ఘటన చోటుచేసుకుంది తిరుపతికి చెందిన జగదీస్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. తన భార్య శివాణీని కాన్పు కోసం జనవరి 9న మలక్ పేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. శివాని బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆమె పరిస్థితి కూడా విషమించింది. దీంతో మలక్ పేట్ ఆసుపత్రి వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివాణి కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతుల కుటుంబ సభ్యులు మలక్ పేట్ ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుల బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుల పట్ల చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆందోళన దిగారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరీ.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.