తెలంగాణలో రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ మధ్య వివాదం సమసిపోలేదు.. గవర్నర్, సీఎంల దూరం తగ్గకపోగా.. రాను రాను మరింత పెరుగుతోంది. తాజాగా గతతంత్ర దినోత్సవ వేడుకలు రణతంత్రంగా మారాయి. చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని.. గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సూచించడం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.. మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. కేసీఆర్ సర్కార్పై కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చానని ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై తెలిపారు. ఆ వివరాలు..
గురువారం ఉదయం హైదరాబాద్ రాజ్ భవన్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో.. గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపట్ల పరోక్షంగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక.. రాష్ట్ర గౌరవాన్ని నిలబెడదామని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళిసై పిలుపునివ్వడం గమనార్హం. అంతేకాక అభివృద్ధి అంటే.. కొత్త భవనాల నిర్మాణం కాదని, నేషనల్ బిల్డింగ్ అని తెలిపారు. ఫామ్ హౌస్లు కట్టడం అభివృద్ధి కాదు.. ప్రజలందరికి ఇళ్లు ఉండటం నిజమైన అభివృద్ధి అంటూ పరోక్షంగా గవర్నర్ ప్రభుత్వానికి చురకలు వేశారు తమిళిసై.
మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు, రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉండటం నిజమైన అభివృద్ధి అని తెలిపారు తమిళిసై. తెలంగాణతో తనకున్న బంధం మూడేళ్లు మాత్రమే కాదని, పుట్టుకతో ఉందన్నారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో తన పాత్ర తప్పకుండా ఉంటుందని తెలిపారు. తనకున్న అతి పెద్ద బలం.. హార్డ్ వర్క్, నిజాయతీ, ప్రేమ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కొంత మందికి తాను నచ్చకపోవచ్చని, కానీ తెలంగాణ ప్రజలంటే తనకెంతో ఇష్టమన్నారు గవర్నర్ తమిళిసై.
అంతేకాక.. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు తమిళి సై. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య రిపబ్లిక్ డే వేడుకలు జరగకుండా చేయాలని ప్రయత్నించారని తమిళిసై ఆరోపించారు. అయితే కొందరు కోర్టుకు వెళ్లడంతో గణతంత్ర వేడుకలకు అవకాశం వచ్చిందని తెలిపారు. గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి తాను లేఖ రాశానని.. అయినా దానిని పక్కనపెట్టి రాజ్భవన్లోనే వేడుకలు జరుపుకోవాలని రెండు రోజుల క్రితం సమాచారం ఇచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కనీసం ప్రసంగ పాఠాన్ని పంపలేదన్నారు. అలానే హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయలేదన్నారు.
తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించిన తమిళి సై.. కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చానన్నారు. ఖమ్మంలో 5 లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభ పెట్టారని, ఆ సభకు లేని కరోనా నిబంధనలు గణతంత్ర వేడులకే గుర్తు వచ్చాయా.. అని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి రాజ్భవనంపై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ విలువలు పాటించడంలేదని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. మరి తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.