ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. రోడ్డు భద్రతా చర్యలు పాటించాలని ఆదేశాలు ఇస్తున్న కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సార్లు ఇలాంటి ప్రమాదాలు డ్రైవర్లు ముందే పసికట్టి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా 30 మందితో వెళ్తున్న బస్సు డ్రైవర్ తనకు గుండె పోటు వచ్చినా.. ప్రాణాలు బిగపట్టి బస్సు ని సురక్షితంగా ఆపి ప్రాణాలు విడిచిన ఘటన కంట నీరు పెట్టిస్తుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని మధురైకి సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ఆర్టీసీ బస్సు గురువారం ఉదయం ఓ 30 మంది ప్రయాణికులతో అరప్పలయం నుంచి కొడైకెనాల్కు బయల్దేరింది. ఈ బస్సును నడుపుతున్న ఆరుముగమ్(44)కు ఉదయం 6:20కి గుండెపోటు అని గ్రహించి బస్సును రోడ్డు పక్కకు ఆపి సీట్లోనే కుప్పకూలాడు. డ్రైవర్ ఆరుముగమ్ బస్సు బయలుదేరినప్పుడు ఛాతీలో నొప్పి వస్తున్నట్లు చెప్పినట్లు కండక్టర్ భాగ్యరాజ్ తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన కండక్టర్ అంబులెన్స్కు సమాచారం అందించాడు. అంబులెన్స్ వచ్చేలోపే దురదృష్టవశాత్తు ఆరుముగం మరణించాడని అధికారులు తెలిపారు.
గత 12ఏళ్ల నుంచి ఆరుముగం తమిళనాడు ఆర్టీసీలో డ్రైవర్గా సేవలందిస్తున్నాడని.. తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TNSTC) అధికారులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కరిమేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాను చనిపోతానన్న విషయం తెలిసి.. బస్సు లో ప్రయాణిస్తున్న 30 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్కు పలువురు సంతాపం వ్యక్తంచేశారు.