ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి రాయల చెరువు పూర్తిగా నిండిపోయింది. ప్రమాదకర స్థాయిలో ఉన్న రాయల చెరువుకు గండి పడే స్థితికి చేరుకుంది. చాలాచోట్ల లీకులు రావడంతో అధికారులు అప్రమత్తమై వాటిని పూడుస్తున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్నారు. ఇక ప్రజా పోరాటాల్లో తనదైన శైలిలో సీపీఐ కార్యదర్శి నారాయణ స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలో చిత్తురూ జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు.. వారికి ధైర్యం చెప్పారు. వరద బాధితుల కష్టాలపై ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించాలని అన్నారు.
ఇదిలా ఉంటే.. రాయలచెరువు లీకేజి వార్తల నేపథ్యంలో పరిశీలనకు వెళ్లిన నారాయణ కాలికి తీవ్ర గాయమైంది. కొండ దిగువకు వస్తుండగా కాలు బెణకడంతో బాగా ఇబ్బంది పడ్డారు. కాలుకు బాగా వాపు రావడంతో కనీసం అడుగు తీసి అడుగు వేయలేకపోయారు. అదే సమయంలో తిరుపతి ఎంపీ, వైసీపీ నేత డాక్టర్ గురుమూర్తి అక్కడికి వచ్చి గాయంతో బాధపడుతున్న సీపీఐ అగ్రనేత నారాయణను గమనించారు. వెంటనే స్పందించిన ఆయన నారాయణ కాలికి చికిత్స చేశారు. కాలుకు కట్టుకట్టి తాత్కాలిక ఉపశమనం కలిగించారు.
ఎంపీ అయినా వైద్యుడిగా తన బాధ్యతను మరవలేదు గురుమూర్తి. రాజకీయ ప్రత్యర్థి అని కూడా చూడకుండా గాయపడిన సీపీఎం నేత నారాయణ చికిత్స చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇక వృత్తి పట్ల అంకితభావం, మంచి మనసు చూపారంటూ వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.