కరోనాతో కకావికలం అవుతున్న ఆంధ్రప్రదేశ్ కి మరో ముప్పు సవాలు విసరబోతుంది. ఇప్పటికే భయం గుప్పిట్లో బతుకుతున్న ప్రజలను ఇంకాస్త వణికిస్తూ.., ఏపీ పైకి భారీ తుఫాన్ దూసుకొస్తోంది. రాష్ట్రంలోని తీర ప్రాంతాలను అతలాకుతలం చేయడానికి ఆ తుఫాన్ వాయువేగంతో సిద్ధమవుతోంది. ఇప్పటికే తౌక్టే తుఫాను ధాటికి భారతావని వణికిపోతుంటే.. ఇప్పుడు ఈ కొత్త తుఫాను ఏమిటని వాతావరణ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈనెల 22 తేదీన తూర్పు తీర ప్రాంతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశమందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాన్ కి యాస్ అని పేరు పెట్టారు అధికారులు. తౌక్టే తుపాను ధాటికి దేశ పశ్చిమ తీర ప్రాంతం అంతా అతలాకుతలం అవుతోంది. ఇక మే 26-27 తేదీల్లో యాస్ తుఫాను తూర్పు తీరాన్ని తాకే అవకాశమున్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 22న ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.., తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. దీని కారణంగానే ఆంధప్రదేశ్ తీర ప్రాంతంలో కూడా వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.
ఇక అల్పపీడనం ఏర్పడిన 72 గంటల్లో అది మరింత బలపడి తుపానుగా మారే అవకాశముంది. అది వాయువ్య దిశగా కదులుతూ మే 26 నాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను తాకే అవకాశముంది. ఒకవేళ అది దిశని మార్చుకుంటే మాత్రం తెలుగు రాష్ట్రాలకి భారీ ముప్పు తప్పకపోవచ్చని ఐఎండీ తుపాను హెచ్చరికల విభాగం వెల్లడించింది. ఈ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు.., అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, బెంగాల్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.సాధారణంగా రుతుపవనాల ఆగమనానికి ముందు ఏప్రిల్, మే నెలల్లో తూర్పు, పశ్చిమ తీరాల్లో తుపానులు ఏర్పడుతుంటాయి. గతేడాది మే నెలలో అంఫన్, నిసర్గ తుపానులు తీర రాష్ట్రాల్లో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటికే ఎరపడ్డ తౌక్టే తుపాను విరుచుకుపడింది. తౌక్టే ధాటికి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్లో భారీ వర్షాలకు పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముంబయి తీరంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి. మరి రానున్న కాలంలో ఇంకెన్ని విపత్తులు మానవాళి మీద దాడి చేయబోతున్నాయో చూడాలి.