ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ ఘటన తనను షాక్కు చేసిందన్నారు. తన ఫ్యాన్స్ వెంటనే ఒక పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఒడిశా రాష్ట్రంలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్లో మృతుల సంఖ్య 233కి చేరింది. ఈ దుర్ఘటనలో 900 మందికి పైగా గాయాలపాలైనట్లు అధికారులు చెబుతున్నారు. గాయాలపాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మన దేశ రైల్వే చరిత్రలో అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో జరిగినట్లుగా చెబుతున్న ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ 128 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఆ స్పీడులో పట్టాలపై ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టింది. దీన్ని బట్టి ప్రమాద తీవ్రతను ఊహించుకోవచ్చు. వేగంగా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే రైల్వే అధికారులు చెబుతున్న మాటలకు, ప్రమాదం సంభవించిన పరిస్థితులకు పొంతన కనిపించడం లేదు.
స్టేషన్ మధ్య గూడ్సు రైలు ఆగి ఉంది. కానీ స్టేషన్లో స్టాప్ లేకపోయినప్పటికీ కోరమాండల్కు అధికారులు లూప్లైన్లో సిగ్నల్ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్లే మెయిన్ లైన్లో కాకుండా లూప్లైన్లోకి రావడంతో అప్పటికే ఆగి ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ బలంగా ఢీకొట్టిందని చెబుతున్నారు. కాగా, ఈ ప్రమాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ విషాదకర ఘటన గురించి తెలియగానే తాను షాక్కు గురయ్యానన్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి చికిత్స కోసం భారీగా రక్తం అవసరం అవుతుందని.. వారి ప్రాణాలు కాపాడేందుకు బ్లడ్ యూనిట్స్ ఆవశ్యకత ఉందన్నారు మెగాస్టార్. కాబట్టి ఘటనాస్థలికి దగ్గర్లో ఉన్న తన ఫ్యాన్స్ వెంటనే వెళ్లి రక్తదానం చేయాలని చిరంజీవి కోరారు.
Utterly shocked at the tragic Coromandel express accident in Orissa and the huge loss of lives! My heart goes out to the bereaved families.
I understand there is an urgent demand for blood units to save lives. Appeal to all our fans and good samaritans in the nearby areas to…— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023