ఫ్లాష్ ఫ్లాష్:
నేటి ఉదయమే జరిగిన ఘోరప్రమాదం
ఇబ్బడి ముబ్బడిగా ఖైదీలు
అంతా మాదకద్రవ్యాల బాధితులే … ఇండోనేషియా దేశంలోని బాంటెన్ ప్రావిన్స్ జైలులో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బాంటెన్ ప్రావిన్సు జైలులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది మరణించారని ఇండోనేషియా న్యాయ, మానవహక్కుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి రికా అప్రింటి చెప్పారు. జైలులో మంటలు అంటుకోవడంతో సహాయసిబ్బంది ఖైదీలను సురక్షితంగా తరలించేందుకు యత్నిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకశాఖ వాహనాలను రప్పించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జైలు అధికారులు అంచనా వేస్తున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అరెస్టు అయిన ఖైదీలు ఈ బ్లాక్లో ఉంటారు. 122 మంది ఉండేందుకు ఈ జైలులో ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు ఎంత మంది ఉన్నారనే వివరాలు మాత్రం తెలియరాలేదు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో డ్రగ్ కేసుల్లో ఖైదీలున్నారని జైలు అధికారులు చెప్పారు. టంజిరంగ్ జైలు సీ బ్లాకులో మంటలు అంటుకున్నాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. అగ్నిప్రమాదం జరిగిన జైలులో 2వేల మందికి పైగా ఖైదీలున్నారు. అగ్నిప్రమాదం అనంతరం సహాయ చర్యల కోసం వందలాదిమంది పోలీసులు, సైనికులను రంగంలోకి దించారు. ఈ వేకువ జామున జైలులోని సి బ్లాక్ లో మంటలు వ్యాపించడంతో తమ గదుల్లో ఉన్న ఖైదీలు తప్పించుకునే మార్గం లేక విలవిల్లాడారు. అధికారులు స్పందించినప్పటికీ, అప్పటికే పదుల సంఖ్యలో ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు.
అగ్ని ప్రమాదానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. ఇండోనేషియా జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలను ఉంచడం కొన్ని రోజులుగా పెద్ద సమస్యగా మారింది. 1,225 మంది సామర్థ్యం గల టాంగెరాంగ్ జైలులో 2000 మందిని ఉంచారు. మరోవైపు సరిపడా నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమవడంతో జైళ్లలో కనీస వసతులు కరువయ్యాయి.
కొంతమది ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించడం, ఖైదీల మధ్య గొడవలు జరగడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే పలుమార్లు స్వల్ప స్థాయి అగ్ని ప్రమాదాలు కూడా చేటు చేసుకున్నాయి. ఈ కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టాంగెరాంగ్ జైలులో ఎక్కువగా మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారిని ఖైదు చేస్తుంటారు.