మార్గదర్శి కేసులో మళ్లీ కదలిక మొదలైంది. తాజాగా ఈకేసులో రామోజీరావుకు , ఏపీ ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై సోమవారం సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి వికాస్ సింగ్ ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. పిటిషన్ లో లేవనెత్తిన పలు అంశాలకు నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీ కోర్టు ఆదేశించినట్లు పిటిషనర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.
ఈ కేసు విషయం గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ” మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై రామోజీ రావుకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మార్గదర్శిలో చేసింది నేరమా? కాదా? అనే విషయంపై వాదోపవాదనలు జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వం మార్గదర్శి కేసులో ప్రధాన పాత్ర పోషించబోతుంది. మార్గదర్శి కేసులో రామోజీ రావు కూడా సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఖాతాదారుల నుంచి డిపాజిట్లు తీసుకుంటున్న వారిని ఒక విధంగా , రామోజీరావును ఒక విధంగా చూడొద్దని కోర్టును కోరడం జరిగింది. ఎవరెవరు డిపాజిట్లు చేశారో వారిపేర్లు అన్ని నాదగ్గర ఉన్నాయి” అని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.