ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ప్రముఖ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రీ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో బుధువారం సీఎం జగన్ తో కలిసి కాసేపు మాట్లాడారు. అలానే వెఎస్సార్ తో సిరివెన్నెల కు ఉన్న అనుబంధం గురించి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కష్ట సమయంలో తమను ఆదుకునందుకు సీఎం జగన్ కు సిరివెన్నెల కుటుంబం పత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా , కుమార్తె లలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్.శాస్త్రీ .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తమ కుటుంబాన్ని ఆదుకున్నందుకు జగన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే సమయంలో ఉమ్మడి ఏపీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని సీఎం జగన్ తో పంచుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రీ అనారోగ్యంగా ఉన్న సమయంలో చికిత్స అయ్యే ఖర్చులను ఏపీ సర్కార్ భరించిన సంగతి తెలిసిందే. అలానే ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఆయన కుటుంబానికి విశాఖలో ఇంటి స్థలం మంజూరు చేసింది. తమను అన్ని విధాల ఆదుకున్న సీఎం జగన్ కు సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు ఆయన కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.