సాధారణంగా మోసగాళ్ల పని పట్టడం పోలీసుల విధి. కానీ కేటుగాళ్లు.. తెలివి మీరడంతో.. ప్రస్తుతం మోసగాళ్ల చేతిలో పోలీసులు కూడా బాధితులవుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను నమ్మి.. సుమారు 2 కోట్ల రూపాయలు మోసపోయాడు నంద్యాలకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్. దాంతో సదరు కానిస్టేబుల్ లెటర్ రాసి పెట్టి అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా బేతంచర్లలో కోర్టు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోన్న సోమ్లా నాయక్ కనపించకుండా పోయాడు. దీని గురించి అతడి భార్య.. కుటుంబ సభ్యులు డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే సోమ్లా నాయక్.. తాను ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు ఓ నోట్ రాసి పెట్టి వెళ్లాడు. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనిలో సోమ్లా నాయక్.. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక మహిళను నమ్మి.. పెద్ద ఎత్తున అప్పులు చేశానని.. కానీ సదరు మహిళ తనను మోసం చేసిందని రాసుకొచ్చాడు. ఆమెను నమ్మి తాను ఏకంగా రెండు కోట్ల రూపాయలు మోసపోయానని తన కుటుంబానికి ఎస్పీ న్యాయం చేయాలంటూ లేఖలో అభ్యర్థించాడు సోమ్లా నాయక్.
చేతిలో ఉన్న సోమ్ముతో పాటు బ్యాంక్ లోన్లు తీసుకుని మరి తాను రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టానని సోమ్లా నాయక్ లేఖలో వెల్లడించారు. ఇక అప్పుల వాళ్ల ఒత్తిడి పెరగడం, పెట్టుబడి నుంచి రిటన్స్ రాకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహించిన సోమ్లా నాయక్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.