ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అభివృద్ది సంక్షేమ పథకాలకు మొదలు పెట్టారు. తాను పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఇచ్చిన హామీలకు కట్టబడి ఉంటానని.. ప్రజా సంక్షేమమే తన ధ్యేయం అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో నిర్ణయానికి శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోనే పేద బ్రాహ్మణుల కోసం ఓ ప్రత్యేక సంక్షేమ పథకాన్ని రూపొందించారు. తాజాగా దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించింది. పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. గరుడ సహాయ పథకం ద్వారా ఈ సాయాన్ని అందించనున్నారు.
ఏడాది ఆదాయం రూ. 75 వేల లోపు ఉన్నవారికి ఈ సాయాన్ని అందిస్తారు. అయితే 2021-2022 సంవత్సరానికి సంబంధించిన మృతుల వివరాలను http://www.andhrabramhim.ap.gov.in/ వెబ్ సైట్ లో పొందుపరచాలని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేద బ్రాహ్మణులకు లబ్ధి చేకూరనుంది. అంత్యక్రియల సమయంలో పేద బ్రాహ్మణులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ పథకం ద్వారా వారికి ఊరట కలిగించే అవకాశం ఉంది.