సకాలంలో వైద్యం అందటం అనేది నేటికి కూడా మనదేశంలో అందని ద్రాక్షగానే మారింది. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎలా దోచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంబులెన్స్లు సరిపడా ఉండవు.. ఉన్నా.. కొన్ని చోట్ల వారు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తారో.. ఇప్పటికే అనేక మార్లు చూశాం. ఈ క్రమంలో తాజాగా అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో.. పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు ఆర్టీసీ బస్సే ఆస్పత్రిగా మారింది. ఆ వివరాలు.. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా సింగరివాడకి చెందిన గర్భిణి మడావి రత్నమాల ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్కు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరింది. గుడిహత్నూర్ మండలం మనకాపూర్ వద్దకు రాగానే పురిటినొప్పులు రావడంతో విషయం తెలిసి డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు.
ఆర్టీసీ బస్సులోనే ఆ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. 108కు ఫోన్ చేసినా సకాలంలో రాకపోవడంతో వెంటనే డ్రైవర్.. బస్సును నేరుగా గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చేర్పించారు. పరీక్షించిన అక్కడి ఆరోగ్య సిబ్బంది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు చెప్పడంతో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్తో పాటు ప్రయాణికులు సంతోషించారు. సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డీవీఎం మధుసూదన్, డీఎం విజయ్ ఆసుపత్రికి చేరుకుని తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తల్లీబిడ్డను సురక్షితంగా ఆసుపత్రికి తరలించిన బస్సు డ్రైవర్ ఎం. అంజన్న, కండక్టర్ సీహెచ్ గబ్బర్సింగ్ను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్రెడ్డి, సీఎండీ సజ్జనార్ అభినందించారు.