ఏపీ సీఎం జగన్ ఏం చేసినా ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే విధంగా ఉంటుంది. రాష్ట్రం అంటే కేవలం ఏదో ఒక వర్గానికి మాత్రమే చెందినది కాదని, అన్ని వర్గాల వారూ కలిసి శ్రమిస్తేనే అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని నమ్మే వ్యక్తి జగన్. అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల కృషి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ఎంపీ విజయ్ సాయి రెడ్డి అన్నారు. సమాజంలోని ప్రతి పనిలోనూ బీసీ వర్గాల కృషి, శ్రమ ఉన్నాయని, వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. వారిని ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చేందుకు సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని విజయ్ సాయి రెడ్డి అన్నారు.
జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది వైఎస్సార్సీపీ ముఖ్య ఉద్దేశమని, దీనిపై ఇదివరకే పార్టీ తరఫున రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లును కూడా పెట్టామని విజయ్ సాయి రెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న వెనుకబడిన సామాజిక వర్గం బీసీ వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీకారం చుట్టింది. బీసీ సామాజిక వర్గాల అభివృద్ధికి మరియు వారి జీవితాలను మెరుగుపరచుకునేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో బీసీ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం బీసీ నాయకులంతా తమతో కలిసి నడవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన బీసీ నాయకులకు వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో బుధవారం నాడు తాడేపల్లిలో వైఎస్సార్సీపీ బీసీ ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మత్య్స శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ, ఎంపీ మార్గాని భరత్ రామ్ సహా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన బీసీ నాయకులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. మూడేళ్ళలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలకు చేసింది కేవలం ఆరంభం మాత్రమే అని, సీఎం జగన్ ఒక సంఘ సంస్కర్త అని అన్నారు. వెనుకబడిన సామాజిక వర్గాల కోసం జగన్ ఎంచుకునే విభిన్నమైన పథకాల ద్వారా సామాజిక న్యాయం చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ చేస్తున్న ఈ పనికి బీసీ నాయకులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.