ప్రభుత్వ ఎయిర్లైన్స్ సంస్థ ఎయిరిండియా అమ్మకం ప్రక్రియ అధికారికంగా పూర్తి అయింది. ఎయిరిండియాను టాటా సన్స్ గ్రూప్ ఎట్టకేలకు సొంతం చేసుకుంది. ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం టాటా గ్రూప్తో పాటు స్పైస్ జెట్ బిడ్ వేసిన విషయం తెలిసిందే. అయితే చివరకు ఎయిరిండియా ఓపెన్ బిడ్ను టాటా సన్స్ గ్రూప్ రూ. 18 వేల కోట్లకు దక్కించుకుంది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ కార్యదర్శి తుహిన్ కాంటా పాండే శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. ఎయిరిండియాలోని వంద శాతం వాటాలను టాటా గ్రూప్ కు విక్రయించడంతో కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియాపై అన్ని హక్కులను కోల్పోయింది. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయాల్లో ఇదో చారిత్రక ఘట్టంగా మార్కెట్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం ఎయిరిండియాకు రూ. 60వేల కోట్ల అప్పులు ఉన్నాయి.
మళ్లీ టాటా చేతుల్లోకి..
స్వాత్రంత్యానికి ముందు 1946లో టాటా ఎయిర్లైన్స్ పేరును ఎయిరిండియాగా మార్చారు. స్వాతంత్ర్యం తర్వాత అప్పటి ప్రభుత్వం ఎయిరిండియాలో 49 శాతం భాగస్వామ్యం తీసుకుంది. ఆ తర్వాత 1953లో ఎయిరిండియాను జాతీయం చేసుకున్న కేంద్రం. తాజాగా 100శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంది. డిసెంబర్ నాటికి ఎయిరిండియా టాటా గ్రూప్ చేతికి రానుంది. దీంతో 68 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటా చేతికొచ్చింది. 2018 మార్చిలో కేంద్రం ఎయిర్ ఇండియాలో 76 శాతం షేర్లను అమ్మేందుకు ఇంట్రెస్ట్ చూపింది. అయితే అప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా స్పైస్ జెట్, టాటా సన్స్ బిడ్స్ వేశాయి. ఈ బిడ్ను టాటా సన్స్ గెలుచుకోవడంతో భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది.