సమాచారం హక్కు చట్టం గురించి దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ఎవరైన సులభంగా పొందే అవకాశం కలిగింది. ఆర్టీఐ చట్టం ద్వారా ఎన్నో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టీఐ చట్టం సామాన్యులకు ఓ ఆయుధమనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకే ప్రభుత్వం కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని అమలు చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆర్టీఐ దుర్వినియోగం అవుతుందనే విమర్శలు ఉన్నాయి. అందుకు నిదర్శనంగా తాజాగా ఓ వ్యక్తి చెత్త ప్రశ్నలు అడిగి.. అడ్డంగా బుక్కయ్యాడు. ఓ మహిళ ఎమ్మార్వోకి భర్తలు ఎంతమంది అంటూ ఆర్టీఐ ద్వారా అడిగాడు. దాంతో జైలు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా ముల్ బాగి తాలుకాకు చెందిన మందకల్ నాగరాజ్ అనే వ్యక్తికి సమాచార హక్కు చట్టం కార్యకర్తగా పేరుంది. ప్రభుత్వానికి సంబంధించిన పలు విషయాలపై ఆర్టీఐ ద్వారా దరఖాస్తూ చేస్తూ.. సమాచారం సేకరించే వాడు. అలానే తాజాగా ఓ మహిళా తహసీల్దార్ వ్యక్తిగత విషయాలను కోరుతూ నాగరాజ్ ఆర్టీఐకి దరఖాస్తు చేశాడు. అందులో సదరు లేడి ఎమ్మార్వోకి ఎన్నిసార్లు పెళ్లైందని, ఆమె ఎన్ని సార్లు విడాకులు తీసుకున్నారని అడిగాడు. అంతటితో ఆగలేదు.. ప్రస్తుతం ఆమె భర్త ఎవరని, ఆమెకు పెళ్లి ఎక్కడ జరిగిందని, ఆమె పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అడిగాడు. అలాగే గతంలో ఆమెను పెళ్లి చేసుకున్నవారు ఎందుకు వదిలేశారని, ఆ భర్తలందరికి ఆమె విడాకులు ఇచ్చారా? అని అడిగాడు.
దరఖాస్తు చూసిన వెంటనే ఇవేం పిచ్చి ప్రశ్నలని .. కర్ణాటక కోలార్ జిల్లా ములబగిలు మండలం రెవెన్యూ కార్యాలయం సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం కింద ఇలాంటి వాటికి దరఖాస్తు చేసుకుంటారా? అని ఆశ్చర్యపోయారు. కానీ తమ పని తాము చేయాల్సిందే కదా? అని.. వెంటనే అందులోంచి తేరుకుని వారు చేయాల్సిన పని చేశారు. నాగరాజ్ అడిగిన ప్రశ్నలపై సదరు మహిళా తహసీల్దార్ మండిపడ్డారు. వెంటనే నాగరాజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెర్వో ఫిర్యాదు మేరకు నాగరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం జుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే స్థానికంగా ఈ విషయం సంచలనం అయింది. అసలు ఆ వ్యక్తి మహిళా తహాసీల్దార్ గురించి ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేసినట్టని, వారి మధ్య ఏదైన శత్రుత్వం ఉందా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు.