‘కౌన్ బనేగా కరోడ్పతీ షో’ లో(KBC) పాల్గొనాలని, అమితాబ్ బచ్చన్ను ప్రత్యక్షంగా కలుసుకోవాలని రైల్వే ఉద్యోగి దేశ్బంధూ ఉబ్బితబ్బిబైపోతూ ముంబైకి వెళ్ళారు. ఆగస్టు 9వ తారీఖు నుంచి 13 వరకూ కేబీసీ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రూ. 3.2లక్షలు గెలుచుకుని సంబరపడిపోతూ ఇంటికి తిరిగొచ్చారు! కానీ ఆయనకు అదృష్టం అక్కడివరకే వెంటొచ్చింది. బిగ్ బీని కలిసిన ఆనందంలో ఇంటికొచ్చిన దేశ్బంధూ పాండే సంబరం ఎక్కువరోజులు మిగల్లేదు. రైల్వేశాఖ ఆయనకు భారీ ఝలక్ ఇచ్చింది. అనుమతిలేకపోయినా సెలవు తీసుకున్నందుకు మూడేళ్ల పాటు ఇంక్రిమెంట్లు నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై ప్రయాణానికి ముందే దేశ్బంధూ సెలవులు కావాలంటూ పైఅధికారులను సంప్రదించారట. లీవులు మంజూరు కాకపోయిన ఆయన కేబీసీ షూటింగ్ కోసం ముంబైకి వెళ్లిపోయారు. షూటింగ్ నుంచి తిరిగొచ్చాక అధికారులు తనపై మోపిన ఆరోపణల చార్జ్ షీట్ చూసుకుని ఆయన ఒక్కసారిగా డీలాపడిపోయారు.
‘అనుమతి లేకపోయినా సెలవుపై వెళ్లడమనేది విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. ఈ కారణంతో చర్యలు తీసుకోక తప్పదం’టూ అధికారులు చార్జ్షీట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల పాటు ఇంక్రిమెంట్లు నిలిచిపోవడమంటే దాదాపు రూ. 1.5 లక్షలు కోల్పోయినట్టేనని రైల్యే వర్గాలు చెబుతున్నాయి. ఆయన కెరీర్పై దీర్ఘకాలిక ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదనే వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. దేశ్బంధూ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయారట. కేబీసీలో పాల్గొనడం ద్వారా లాభానికి కంటే నష్టమే ఎక్కువగా జరిగేటట్టు ఉందని ఆయన ఆవేదన పడుతున్నట్టు తెలుస్తోంది.
చార్జ్ షీటులో రైల్వే అధికారులు ఆగస్టు 13వ తారీఖును పేర్కొనడంపై ప్రస్తుతం ఉద్యోగవర్గాల్లో చర్చనడుస్తోంది. సెలవుల గురించి ఆయన పైఅధికారులను సంప్రదించినా మంజూరు కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దేశ్బంధూ పాండేకు రైల్వే ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. రైల్వే ఉన్నతాధికారుల వైఖరి సరైనది కాదంటూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు న్యాయకోసం ఆయన తరపున పోరాడుతామని ప్రకటించారు. సరైన కారణం చూపించిన ఉద్యోగికి తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని పశ్చిమ సెంట్రల్ రైల్వే మజ్దూర్ సంఘ్ డివిజనల్ సెక్రెటరీ పేర్కొన్నారు.