స్పోర్ట్స్ డెస్క్- వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం, మన తెలుగు ముద్దు బిడ్డ కరణం మళ్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించిన మళ్లీశ్వరి ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ గా నియమితురాలైంది. ఈ మేరకు కరణం మల్లీశ్వరిని ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం మొదటి వీసీగా నియమిస్తూ ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ అజ్మిల్ హఖ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంద్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఊసవానిపేటకు చెందిన మల్లీశ్వరి 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి రికార్డ్ నెలకొల్పింది.
అంతకు ముందు వరల్డ్ చాంపియన్ షిప్ లో రెండుసార్లు స్వర్ణ పతకాలు సాధించిన మళ్లీశ్వరికి కేంద్ర ప్రభుత్వం 1999లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1997లో హరియాణాకు చెందిన సహచర వెయిట్ లిఫ్టర్ రాజేష్ త్యాగిని వివాహం చేసుకున్న మల్లీశ్వరి ఆ తర్వాత అక్కడే స్థిరపడింది. ఈ మధ్యే అక్కడ వెయిట్ లిఫ్ట్ అకాడమీని స్థాపించిన మళ్లీశ్వరి వర్థమాన వెయిట్ లిఫ్టర్లకు శిక్షణ కూడా ఇస్తోంది. 46 ఏళ్ల మల్లీశ్వరి ప్రస్తుతం హరియాణాలోని భారత ఆహార గిడ్డంగుల శాఖ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తోంది.
కేజ్రీవాల్ ప్రభుత్వం ముండ్కా పట్టణంలో దేశంలోనే తొలి స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. పదేళ్ల తర్వాత దేశంలో జరిగే ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కనీసం 50 పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. క్రీడాకారులు డిగ్రీ కోసం తమకు సంబంధం లేని ఏదొక కోర్సులో చేరి చదువుతుంటారు. ఐతే ఈ విశ్వవిద్యాలయంలో ఏ ఆటలో అయితే రాణించాలని అనుకుంటారో, అందులోనే ప్రత్యేకంగా డిగ్రీ చేసేలా విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆ రంగానికే చెందిన ప్రముఖులు వీసీగా ఉంటే బాగుంటుందని ఢిల్లీ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే కరణం మల్లీశ్వరిని వీసీగా నియమించింది కేజ్రీవాల్ సర్కార్.