కర్ణాటకలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. బెంగళూరు నగరంలోనే పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. బెంగళూరు పరిధిలో కరోనా టెస్టులు చేయించుకున్న వారిలో 3 వేల మందికి పైగా తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ పరిశీలనలో తేలింది. వారందరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పాజిటివ్ వచ్చిందని వారికి చెబుదామంటే ఫోన్లు కలవకపోవడం.. ఇంటి అడ్రస్లు సరిగా లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ఈ విషయాన్ని వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్, వీరందరూ ఎక్కడ ఉన్నారు? ఎవరెవరిని కలుస్తున్నారన్న విషయాన్ని కనుక్కోవాలని పోలీసులను ఆదేశించామని అన్నారు. వీరంతా తమ మొబైల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నారని, దీంతో వారి ఆచూకీ కనుక్కోవడం కష్టతరం అవుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కరోనా బాధితులకు కావాల్సిన ఔషధాలను ఉచితంగానే అందిస్తున్నామని, 90 శాతం కేసులను నియంత్రణలోనే ఉంచుకున్నామని, అయితే, కరోనా తమకు సోకిందని తెలిసి కూడా బయట తిరుగుతూ ఉన్న వారితో సమస్య పెరుగుతోందని అన్నారు. ఇదే సమయంలో చాలా మంది వైరస్ సోకిన చాలా రోజుల తరువాత, పరిస్థితి విషమించిన దశలో ఆసుపత్రులకు వస్తున్నారని ఆయన అన్నారు.”నేను వారికి చేతులు జోడించి ఒకటే చెప్పాలని భావిస్తున్నాను. వారి చర్యల కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోంది. చివరి సమయంలో ఐసీయూ బెడ్ల కోసం రావడం చాలా తప్పు. ఆ పని చేయనే చేయవద్దు. చాలా మంది తమ ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అదృశ్యమైన వారంతా ఇళ్లల్లో లేరు. వారెక్కడున్నారో తెలియడం లేదు. వెంటనే అందరూ వైద్యాధికారులను సంప్రదించాలి” అని ఆర్ అశోక్ వ్యాఖ్యానించారు.