హైదరాబాద్- తెలంగాణలో జరిగిన మినీ మునిసిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ అన్నింట్లో గెలుపొందింది. మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 74శాతం ఓట్లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాలను టీఆర్ఎస్ కు, 3 స్థానాలను మిత్రపక్షం సీపీఐకి కలిపి 184 స్థానాల్లో గెలిపించి టీఆర్ఎస్ కు తిరుగులేదని మరోమారు నిరూపించారని ముఖ్యమంత్రి అన్నారు.
టీఆర్ఎస్ పార్టీయే మా పార్టీ అని తెలంగాణ ప్రజలు నిష్కర్షగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారన్నారని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి ఇంతటి అద్భుత విజయాన్ని చేకూర్చిన ఏడు మున్సిపాలిటీల ప్రజలందరికీ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందినవారందరికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.