గత కొంతకాలంగా లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులను సరోగసీ వివాదం చుట్టిముట్టిన విషయం తెలిసిందే. సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారని దేశ వ్యాప్తంగా పెద్ద రచ్చ జరిగింది. సరోగసీని ఎప్పుడో నిషేధించారని, అది ఆ విధానాన్ని అనుసరించడం నేరమని పలు విమర్శలు వెలువెత్తాయి. నయనతారపై చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తమిళనాడు సర్కార్ సరోగసీపై విచారణ కమిటీకి ఆదేశించింది. ఈ మేరకు కమిటీ తమ నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి బుధవారం సమర్పించింది. ఈ నివేదికలో నయన్, విఘ్నేష్ శివన్ ల వివాహం, సరోగసీ కోసం దంపతులు చేపట్టిన చర్యలను కమిటీ పూర్తి స్థాయిలో వెల్లడించింది.
2016 మార్చి 11న విఘ్నేష్ శివన్ ను నయనతార పెళ్లి చేసుకున్నట్లు దంపతులు అఫిడవిట్ దాఖలు చేసినట్లు కమిటీ తెలిపింది. నయనతార దంపతులు 2021 ఆగస్టు నెలలో సరోగసీ ప్రక్రియను ప్రారంభించారని, నిబంధనలకు అనుగుణంగానే అదే ఏడాది నవంబర్ లో సరోగసీ కోసం ఒప్పందం చేసుకున్నారని కమిటీ వెల్లడించింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నయనతార దంపతులు సరోగసీ ద్వారా పిల్లలను కన్నారని కమిటీ తేల్చింది. కాబట్టి నయనతార దంపతులకు కలిగిన పిల్లలు చట్టబద్ధమేనని, చట్టబద్ధంగానే నయనతార దంపతులు పిల్లల్ని కన్నారని కమిటీ తెలిపింది. దీంతో నయనతార దంపతులకు సరోగసీ కేసులో ఉపశమనం లభించినట్టయ్యింది.