నటిగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. సినీ కెరీర్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఆ తర్వాత ఆమెకు వచ్చిన సమస్యలతో జీవితంలో ధీనమైన పరిస్తితిని ఎదుర్కొన్నది.
సినిమా అనే రంగుల ప్రపంచంలో తెర ముందు వినోదాన్ని పంచిన నటీనటులకు తెర వెనుకు చోటుచేసుకున్న విషాద ఘటనలు ఎన్నో. వ్యక్తిగత ఇబ్బందులతో జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వారు చాలా మందే ఉన్నారు. సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన తారలు చివరకు ధీన స్థితిలో తనువు చాలించిన సందర్భాలు ఉన్నాయి. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా అవకాశాలు వచ్చినప్పుడే ఆర్థికంగా అన్ని విధాలుగా నిలదొక్కుకోవాలి లేదంటే భవిష్యత్ లో కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. ఇదే రీతిలో అలనాటి తార మహానటి సావిత్రి ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత ఊహించని విధంగా కష్టాలపాలైంది. ఇక మరో తెలుగింటి హీరోయిన్ సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి ఆఖరికి చికిత్సకు డబ్బుల్లేక ధీన స్థితిలో మరణించింది.
సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి అశ్విని. ఆమె ఏపీలోని నెల్లూరు జిల్లాలో జన్మించింది. హీరోయిన్ గా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ లో కలుపుకుని 100కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో భక్త ధ్రువ మార్కండేయ అనే సినిమాలో బాలనటిగా కనిపించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా మారి వెంకటేశ్తో కలియుగ పాండవులు, రాజేంద్ర ప్రసాద్తో స్టేషన్ మాస్టర్, రాజశేఖర్తో అమెరికా అబ్బాయి చిత్రాలతో పాటూ చూపులు కలసిన శుభవేళ, అనాదిగా ఆడది వంటి పలు సినిమాలలో నటించి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది.
అయితే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి అశ్విని రహస్యంగా పెళ్లి చేసుకుని చిక్కుల్లో పడింది. పెళ్లైన కొంతకాలానికే భర్త విడిచిపెట్టి వెళ్లిపోవడంతో మానసికంగా కుంగిపోయింది. ఒంటరిగా ఉన్న ఆమె కార్తిక్ అనే బాబును దత్తత తీసుకుని పెంచుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో సీరియల్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇన్ని సమస్యల నడుమ నటి అశ్విని ఆనారోగ్యానికి గురయ్యింది. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన ఆమె ఆస్తులను కూడబెట్టుకోలేదు. ఆర్థిక కష్టాలను అనుభవించింది. వైద్య చికిత్సల కోసం చెన్నైలో ఉన్న ఇళ్లును కూడా అమ్మేసి అద్దె ఇంట్లో కాలం వెల్లదీసింది. పోనుపోను ఆరోగ్యం మరింత క్షీణించి 2012 సెప్టెంబర్ 23న నటి అశ్విని తుదిశ్వాస విడిచింది.