యాక్షన్ కింగ్ ఇమేజ్ తెచ్చుకున్న అర్జున్ మొదటి నుంచి ఆంజనేయ స్వామికి ప్రియ భక్తుడు. ఆ అభిమానంతోనే ఆయన పద్మాసనంలో కూర్చున్న ఆంజనేయ స్వామి విగ్రహంతో కూడిన గుడిని కట్టించి ప్రారంభించారు. భక్తి భావాలు ఎక్కువగా ఉండే అర్జున్ గతంలో టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘శ్రీ ఆంజనేయం’ హనుమంతుడి పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. హనుమంతుడిపై ఉన్న అమితమైన భక్తితో ఆ పాత్రలో లీనమై పలువురి ప్రశంసలందుకున్నారు. వెంటనే ఆంజనేయ స్వామికి స్వయంగా తానే ఓ గుడి కట్టించాలని పూనుకున్న అర్జున్ దాదాపు 17 ఏళ్ల పాటు శ్రమించి ఆ కల నెరవేర్చుకున్నారు.
ముప్పై ఐదు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం మొత్తం ఒకే రాతితో చెక్కబడింది. ప్రపంచంలో పద్మాసనంలో కూర్చున్న ఆంజనేయ విగ్రహం ఇదే అంటున్నారు. 140 టన్నుల భారీ హనుమాన్ విగ్రహంతో ఆలయాన్ని నిర్మించారు. సొంత ఖర్చులతోనే నటుడు అర్జున్ సర్జా ఈ ఆలయానికి కార్యరూపం ఇచ్చారు. ప్రస్తుతం భక్తుల సందర్శనార్థం ఆంజనేయ స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని కేవలం తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ ఆలయాన్ని ప్రారంభించారు అర్జున్. పురోహితుల వేదమంత్రాల నడుమ కుంభాభిషేకం నిర్వహించి భక్తులంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి లైవ్ ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. కర్ణాటక శిల్పి అశోక్ గుడిగర్ సారథ్యంలో హనుమంతుడి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ఠింప జేశారు. కర్ణాటక నుంచి చెన్నై ఈ విగ్రహాన్ని తీసుకు రావటానికి ప్రత్యేకంగా 160 చక్రాల ట్రక్ తయారు చేయించారు. గతంలోనూ రాఘవ లారెన్స్ కూడా మొన్నీ మధ్య రాఘవేంద్రస్వామి గుడి కట్టించిన సంగతి తెలిసిందే.