ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు సోమవారం (నేటి ఉదయం) తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న స్వామివారి విగ్రహాన్ని ఉఖిమత్ ఓంకారేశ్వర్ నుంచి ఆలయానికి తీసుకువచ్చారు. రుద్రప్రయాగ్లోని ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సుమారు 11 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కరోనా కారణంగా, భక్తులు గత సంవత్సరంలో లానే ఈసారి కూడా కేదారనాధుడిని నేరుగా చూసే అవకాశం లేదు. ఆన్లైన్లో మాత్రమే భక్తులు భగవంతుని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాలలో ఉన్న బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి అలాగే యమునోత్రి దేవాలయాలను చార్ ధామ్ అంటారు. చార్ ధామ్ ఆలయాలు నాలుగూ ప్రతి సంవత్సరం ఏప్రిల్-మే నెలలలో తెరుస్తారు. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈ నెల 14న తెరుచుకోగా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
బద్రీనాథ్ ఆలయం సైతం మంగళవారం ఉదయం తెల్లవారు జామున 4.15 గంటలకు బ్రహ్మముహూర్తంలో తిరిగి తెరవనున్నారు. ఆలయం గత నవంబర్ 16న మూసివేశారు. చార్ధామ్ యాత్రలోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చలికాలంలో మూసివేస్తుండగా మళ్లీ ఆరు నెలల తర్వాత ఏప్రిల్ – మే మధ్యలో తెరుస్తారు. ఆలయాల పునః ప్రారంభానికి సన్నాహాలు వారం కిత్రమే చార్ధామ్ దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేసింది. ఆలయ ప్రాంగణాల వద్ద మంచు తొలగింపు పనులు చేపట్టింది. పారిశుధ్యం పనులు పూర్తి, చేసి విద్యుత్ సౌకర్యం కల్పించారు. యాత్రికులకు అవకాశం కల్పించడం లేదని, కేవలం ఆలయంలో ఆచారాలు మాత్రమే కొనసాగుతాయని పేర్కొంది. అన్ని ఆలయాల్లో పూజ పారాయణతో సంబంధం ఉన్న వ్యక్తులను లోపలకు అనుమతిస్తారు. వారి సంఖ్య కూడా 25 మించకూడదు. కరోనా జాగ్రత్తలు అన్నీ ఈ సమయంలో తీసుకుంటారు.