రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసులో కీలక సాక్షిగా పరిగణిస్తున్న వ్యక్తి.. ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు.. ఈ కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన కన్నుమూశారు. గంగాధర్ రెడ్డి నిద్రపోయిన సమయంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వారు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి గంగాధర్ రెడ్డి మృతదేహాన్ని తరలించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటికే మూడుసార్లు గంగాధర్రెడ్డిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్రెడ్డికి గంగాధర్రెడ్డి అనుచరుడుగా ఉన్నారు. గంగాధర్ రెడ్డి స్వగ్రామం పులివెందుల కాగా.. ప్రేమ వివాహం చేసుకుని యాడికిలో ఉంటున్నారు. తనకు ప్రాణముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని రెండుసార్లు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ గతంలో చెప్పారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.