దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తనను నమ్మి వచ్చిన ప్రియురాల్ని చంపి 35 ముక్కలుగా కోసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరి అత్యంత కిరాతకానికి ఒడిగట్టిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా(28)ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అతడి నుంచి కీలక ఆధారాలు రాబెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, అతడు పొంతనలేని సమాధానాలతో పోలీసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ఉదంతంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.
పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు తన ప్రియురాలిని హత్యచేసి, 35 ముక్కలు చేసిన ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలెన్నో బయటకొస్తున్నాయి. తాను పలు క్రైం వెబ్ సిరీసులు చూసేవాడినని, అమెరికా టీవీ సీరియల్ ‘డెక్స్ట్రర్’ స్ఫూర్తితో శ్రద్ధాను ముక్కలుగా నరికేశానని నిందితుడు విచారణలో వెల్లడించాడు. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. దేవుడికి వింత అభ్యర్ధన చేశారు.
‘మరణించి ఎక్కడో విశ్రాంతి తీసుకునే బదులు.. ఆత్మగా తిరిగి వచ్చి అతడిని 70 ముక్కలు చేయాలి. ఇలాంటి క్రూరమైన హత్యలను కేవలం చట్ట భయంతో అరికట్టలేము. మృతిచెందినవారి ఆత్మలు తిరిగివచ్చి హంతకులను చంపితే.. వాటిని కచ్చితంగా ఆపవచ్చు. భగవంతుడు దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను..’ అని ట్వీట్ చేశాడు.
Instead of resting in PEACE she should come back as a spirit and cut him into 70 PIECES
— Ram Gopal Varma (@RGVzoomin) November 16, 2022
Brutal murders can’t be prevented just by fear of law ..But they can be definitely stopped if the victims spirits come back from the dead and kill their killers ..I request God to consider this and do the needful 🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) November 16, 2022
మహారాష్ట్రకు చెందిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా, శ్రద్ధా వాకర్ లు మూడేళ్లు సహజీవనం చేశారు. కుటుంబ సభ్యులు వద్దనడంతో వారిద్దరూ ముంబయి నుంచి దిల్లీకి మకాం మార్చారు. తరువాత శ్రద్దా.. తనను పెండ్లి చేసుకోవాలని అఫ్తాబ్పై ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఈ విషయమై ఇద్దరూ తరచుగా గొడవ పడుతుండేవారు. మే 18న మరోసారి జరిగిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో అఫ్తాబ్ మే 18న ఆమెను గొంతుకోసి చంపాడు. ఆపై శవాన్ని 35 ముక్కలు చేసి వాటిని ఫ్రిజ్ లో దాచాడు. 18 రోజులపాటు వాటిని రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి విసిరేశాడు. శ్రద్ధాకు ఫోన్ చేసినా ఎలాంటి స్పందనా రాకపోవడంతో ఆమె తండ్రి ఈనెల 8న దిల్లీకి వచ్చి, తన కుమార్తె ఉండే ఇంటికి వెళ్లాడు. అక్కడ తాళం వేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ముంబైలోని ఓ కాల్ సెంటర్లో పనిచేసిన సమయంలో అక్కడ ఆమెకు అఫ్తాబ్తో స్నేహం ఏర్పడిందని బాధితురాలి తండ్రి వికాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె నిర్ణయాన్ని కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. ఆమె వినకుండా అఫ్తాబ్తో ఢిల్లీ వెళ్లి సహజీవనం చేసింది. ఢిల్లీలోని ఛతర్పూర్ ప్రాంతంలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని నివసించేవారు. 2022 మే నెల తర్వాత నుంచి తమ కుమార్తె నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, తమను ఆమె సంప్రదించలేదని తండ్రి వికాస్ అందులో వివరించాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అఫ్తాబ్ ను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.