ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల లేఖ ఒకటి కలకలం సృష్టిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేను బెదిరిస్తూ.. లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది. తక్షణమే రాజీనామా చేయాలని.. లేదంటే ప్రజాకోర్టులో ఎమ్మెల్యేని శిక్షిస్తామని బెదిరించడం కలకలం సృష్టిస్తోంది. ఆ వివరాలు..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో లేఖ విడుదలైంది.. మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి మండలం చాపరాతి పాలెంలో జరుగుతున్న మైనింగ్ను తరిమి కొట్టాలని పేర్కొన్నారు. పార్టీలకు పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో ఆ లేఖ వచ్చింది. అయితే, మావోయిస్టు పేరుతో తనకు బెదిరింపు లేఖ రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.
తమ ప్రాంతంలో ఎటువంటి మైనింగ్ జరగడం లేదు… తాము ఎవ్వరికీ పర్మిషన్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. 2019 ముందు జరిగిన మైనింగ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యావరణాన్ని దెబ్బతీశాయని తెలిపారు. ‘‘చదువుకున్న వ్యక్తిగా చెబుతున్నా.. మా ఉత్తరాంధ్ర ప్రాంత పర్యావరణాన్ని దెబ్బతీసే ఏ పని నేను చేయను. ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు కూడా మా అధినేత జగన్ అక్రమ మైనింగ్ పై పోరాడారు’’ అని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేసిన వాళ్లమేనని గుర్తుచేసుకున్న ఆమె.. అలాంటిది ఇప్పుడు మైనింగ్ చేస్తామా? అని ప్రశ్నించారు. మావోయిస్టు పేరుతో ఈ లేఖ ఎవరు రాశారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధిష్టానం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తా.. గతంలో జరిగిన అక్రమ బాక్స్ బాక్సైట్ తవ్వకాలపై విచారణ జరపాలని ఇప్పటికే కోరడం జరిగిందని వెల్లడించారు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.