గత ఏడాది కరోనా టైమ్ లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య పేరు తెరపైకి వచ్చింది. తాజాగా రాష్ర్టంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆనందయ్య మందు మరోసారి తెరపైకి వచ్చింది. కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ కు ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారని సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయుష్ శాఖ స్పందించింది. అనుమతి లేకుండా ఒమిక్రాన్ మందు అంటూ పంపిణీ చేయడం సరికాదని ఆయుష్ శాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆనందయ్యకు నోటీసులు జారీ చేసింది.
మందు పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఒమిక్రాన్ మందులో ఏఏ పదార్థాలు వాడుతున్నారో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఆనందయ్య ఇచ్చే సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయుష్ శాఖ పేర్కొంది. అవసరమైతే ఒమిక్రాన్ మందులో వాడే పదార్థాలను పరిశీలిస్తామని తెలిపింది. కాగా ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుకు ఎలాంటి అనుమతి లేదని ఆయుష్ శాఖ మరోసారి స్పష్టం చేసింది.