కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఎగువ అహోబిలంలో పావన నరసింహస్వామి ఆలయానికి కాలినడకన వెళ్తున్న భక్తుడిపై చిరుత దాడి చేసింది. మెట్ల మార్గంలో కాపు కాసిన చిరుత ఒక్కసారిగా భక్తుడిపైకి దూకి దాడి చేసింది. వెంటనే తేరుకున్న భక్తుడు మెట్ల పై నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు.
ఈ విషయం తెలిసిన భక్తులు మెట్లమార్గం గుండా వెళ్లేందుకు భయపడుతున్నారు. వారం రోజులుగా పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారిస్తుండడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మద్యనే ఆలయంలోనే వెనుకవైపు ఉన్న ధ్వజస్థంబం నుంచి లోపలికి వచ్చిన చిరుత రామానుజాచార్యుల మండపం వద్ద ఉన్నకుక్కపిల్లలను లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఇది చదవండి : నమామి గోవింద బ్రాండ్.. టీటీడీ భక్తుల కోసం ప్రత్యేత ఉత్పత్తులు
స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు బిక్కుబిక్కుమంటూ దర్శనం చేసుకున్నారు. గతంలోనూ చిరుతలు ఆళ్లగడ్డ, అహోబిలం రోడ్డులో దుర్గమ్మ ఆలయం వద్ద కనిపించినట్టు అక్కడి ప్రజలు చెబుతున్నారు. చిరుత దాడి విషయం తెలుసుకున్న అటవీ శాఖాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.