శుక్రవారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీటిపర్యంతం అవ్వడంపై బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అసెంబ్లీకి వెళ్తున్నామా? గొడ్లచావిడికి వెళ్తున్నామా అనే అనుమానం వస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగం మధ్య జరిగిన ఈ ప్రెస్ మీట్ లో బాలయ్య ఏమి మాట్లాడారో యథావిధిగా ఇప్పుడు చూద్దాం.
అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. నాయకులు పరిస్థితులపై పోరాడాలి. కామెంట్లు సిద్ధాంత పరంగానే ఉండాలి.. నాన్నగారి నుంచి కూడా అదే జరిగేది. కానీ.., ఇప్పుడు అసెంబ్లీలో వ్యక్తిగత దూషణే అజెండాగా పెట్టుకున్నారు. చంద్రబాబు గారి భార్య మీదకు పర్సనల్ గా వెళ్లడం దురదృష్టకరం. వారి భాష, ఆంగీకం చూస్తుంటే.. గొడ్ల చావిడిలో ఉన్నామా? అసెంబ్లీలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. వ్యక్తిగతంగా.. రాజకీయాలతో సంబంధం లేకుండా గౌరవంగా బతికే మహిళలను ఇలా లాగడం ఏంటి? వారిళ్లలోని మహిళలు కూడా వారిని ఛీదరించుకుంటున్నారు అన్న విషయం అర్థం కావడం లేదు. వారి ఇంట్లోనూ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఆ ఇష్యూస్ ను డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారా?
రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి వదిలేసి.. ఇంట్లోని ఆడవాళ్ల మీదకు వచ్చి వ్యక్తిగతంగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా చేస్తూ పోతే చేతులు కట్టుకుని కూర్చున్నామని కాదు. రాజకీయంగా హుందాగా ఉండటం నాన్నగారి నుంచి నేర్చుకున్నాం. మీరు మారక పోతే మెడలు వంచి మారుస్తాం. ఇకపై ఉపేక్షించేది లేదు. ఇష్యూ మీద మాట్లాడండి. రాజకీయాలతో సంబంధంలేని మహిళలను తీసుకొస్తే ఊరుకోం. ఇంతకాలం చంద్రబాబు మాట వినే చేతులు కట్టుకుని కూర్చున్నాం. ఆయనే కన్నీరు పెట్టాక ఇక ఎవ్వరిని లెక్క చేయం. ఇక నుంచి ఇలాంటి నీఛ నికృష్ట పదజాలం ఉపయోగిస్తే భరతం పడతాం.. ఖబర్దార్. జాగ్రత్తగా ఉండండి.. ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడండి. మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. మళ్లీ ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు అడ్డుపెట్టుకునే ఏ వ్యవస్థలు మమ్మల్ని ఆపలేవు. వాటిని బద్దలు కొట్టుకుని వచ్చి మీకు గుణపాఠం చెబుతాం. ఓ సీఎం కొడుకుగా, సీఎం బావమరిదిగా నేను ఏనాడు ఇలా మాట్లాడలేదు. జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోండి అంటూ బాలయ్య ఫైర్ అయ్యారు. మరి.. బాలయ్య వ్యాఖ్యలకు వైసీపీ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి.. బాలయ్య ప్రెస్ మీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.