కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనలో బైకర్ గాయపడ్డాడు. దీంతో ఆ నేత కారు దిగారు. ఆయనేం చేశారంటే..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కారు.. రోడ్డు ప్రమాదానికి కారణమైంది. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో గురువారం దిగ్విజయ్ కారు ఒక బైకర్ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకర్కు గాయాలయ్యాయి. దీంతో దిగ్విజయ్ దగ్గరుండి మరీ ఆ బైకర్ను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తన కారు డ్రైవర్పై కేసు నమోదు చేయించి.. అరెస్ట్ చేయించారు. తానే దగ్గరుండి మరీ ఆ వాహనాన్ని పోలీసులతో సీజ్ చేయించడం గమనార్హం. రాజ్గఢ్లోని కొడయాకా గ్రామంలో జిల్లా స్థాయి అధ్యక్షుల మీటింగ్ జరిగింది. దీనికి హాజరైన దిగ్విజయ్, మధ్యాహ్నం అక్కడి నుంచి తిరుగుపయనం అయ్యారు. ఆ సమయంలో జీరాపూర్లోని ఒక ప్రైవేటు స్కూలు వద్ద డిగ్గీ రాజా ప్రయాణిస్తున్న కారు ఓ బైకర్ను వేగంగా ఢీకొట్టింది.
దిగ్విజయ్ కారు ఢీకొట్టగానే పది అడుగుల దూరం వెళ్లి పడ్డాడు బైకర్. వెంటనే కార్యకర్తలతో పాటు ముందు సీటులో కూర్చున్న ఆయన కారు దిగారు. బాధితుడ్ని కార్యకర్తల సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన బైకర్ను పరవాలియాకు చెందిన బాగ్రి (20)గా గుర్తించారు. ప్రమాదం తర్వాత ఆస్పత్రికి వెళ్లి అతడి పరిస్థితి గురించి ఆరా తీశారు డిగ్గీ రాజా. దేవుడి దయ వల్ల ఆ యువకుడికి తీవ్ర గాయాలవ్వలేదని.. అతడి ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని మీడియాకు చెప్పారాయన. స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం అతడ్ని భోపాల్కు రిఫర్ చేశారు డాక్టర్లు. కాగా, తన కారు డ్రైవర్పై పోలీసులతో కేసు నమోదు చేయించిన డిగ్గీ రాజా.. ఆ వాహనాన్ని అక్కడే వదిలేసి, స్థానిక ఎమ్మెల్యే కారులో వెళ్లిపోయారు.