ప్రాణాపాయస్థితిలో పడిపోయి ఉంటే.. కుయ్ కుయ్ మంటూ వచ్చి ఊపిరి నిలిపే 108 అంబులెన్స్ మార్గమధ్యలో మొరాయిచింది. దీంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హృదయాన్ని కలిచివేసే ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం రాళ్లాపురం గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాలు.. రాళ్లాపురం గ్రామానికి చెందిన గొత్తికోయ మహిళ మాడవి చుకిడీ (25) కుటుంబ సమస్యల కారణంగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలుకల మందు తాగింది. కుటుంబ సభ్యులు గురువారం (జూన్ 30) ఉదయం గమనించి 108కు ఫోన్ చేశారు. దీంతో చర్లకు చెందిన 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. కొన ఊపిరితో ఉన్న చుకిడీని తీసుకొని ఆ అంబులెన్స్ ఆసుపత్రికి బయలుదేరింది. కానీ.. దురదృష్టవశాత్తు అటవీ మార్గంలో ఓ చోట ఆగిపోయింది. సిబ్బంది, మహిళ బంధువులు కిందికి దిగి తోసినా అంబులెన్స్ స్టార్ట్ కాలేదు.
సుమారు అర్ధగంట సేపు ప్రయత్నించిన తర్వాత బాధిత మహిళ చుకిడీని బైక్పై కూర్చోబెట్టుకొని చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. అంబులెన్స్ మొరాయించి ఉండకపోతే చుకిడీ బతికేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా 108 అంబులెన్స్ సరిగా పని చేయడం లేదని స్థానికులు తెలిపారు. ఉన్నతాధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోలేదని అంబులెన్స్ సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.