తెలుగు రాష్ట్రాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో ‘మా’ఎన్నికల అంశంపై రగడ కొనసాగుతుంది. సాధారణ ఎన్నికలను తలదన్నేలా ‘మా’ఎన్నికల స్టంట్ కొనసాగుతుంది. మంచు విష్ణు ప్యానల్, ప్రకాష్ రాజ్ ప్యానల్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ ప్యానెల్ లో సభ్యులు గత కొన్ని రోజుల నుంచి ఒకరిపై ఒకరు మాటల యుద్దం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది మాత్రం ‘మా’ ఎన్నికల విషయం గురించి నోరు విప్పాలంటే ఎక్కడ కాంట్రవర్సీలు అవుతాయో అని దూరంగా ఉంటున్నారు. మరికొంత మంది మాత్రం మీడియా ముందుకు వచ్చి తమ సపోర్ట్ ఎవరికీ అనే విషయాన్ని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.
ఇక అక్టోబర్ 10న ‘మా’ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. తాజాగా నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్టకేలకు ‘మా’ ఎన్నిల విషయంలో స్పందించారు. అంతే కాదు తన సపోర్ట్ ఎవరికీ అన్న విషయాన్ని తాజా మీడియా సమావేశంలో తెలియజేశారు. తాను ‘మా’ అర్టిస్ట్ గా ఎన్నికల్లో తప్పకుండా పాల్గొంటానని.. తన ఓటు తప్పకుండా వినియోగించుకుంటానని అన్నారు. ‘మా’ అసోసియేషన్ ను అభివృద్ధి చేయడానికి ఎవరు ఏం చేస్తారు ? అనే విషయాన్ని తెలియజేస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు. దాంట్లో ‘మా’ ఆర్టిస్టులకి ఏ మేనిఫెస్టో ఉపయోగకరంగా ఉంటుందో వారికే ఓటు వేస్తాను అని అన్నారు.
గత కొంత కాలంగా ‘మా’లో లోకల్.. నాన్ లోకల్ అనే విషయం పై వివాదం నడుస్తోంది. మీరు దేనికి సపోర్ట్ చేస్తారు ? అని అడగ్గా… కాంట్రవర్సీ ప్రశ్నలు నన్ను అడగొద్దు. ఈసారి ‘మా’ ఎన్నికలు మా రాజకీయ ఎన్నికలకన్నా వాడిగా వేడిగా సాగుతున్నాయి. అందులో నేను ఏమాత్రం జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని అన్నారు. ఒక ఆర్టిస్ట్ గా నా ఓటును మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను అని అన్నారు.