ఖుష్బు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఖుష్బు. ఆ తర్వాత తెలుగు, తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అభిమానులు ఆమె మీద ప్రేమతో ఏకంగా గుడి కట్టారు. ఆ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఖుష్బు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మంచి పాత్రల్లో నటిస్తూ.. కెరీర్లో ముందుకు సాగుతున్నారు. అటు రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఖుష్బు. ఇక ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ అయ్యి.. యంగ్ లుక్లోకి మారిపోయి.. కుర్ర హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోతున్నారు ఖుష్బు.
ఇక ఈమధ్య కాలంలో తరచూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు ఖుష్బు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరగా.. ఇటీవల తన కాలుకి గాయం అయ్యింది అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఖుష్బు. గాయం అయినా తన ప్రయాణం ఆగదని చెప్పిన ఖుష్బు అన్నట్లుగానే.. మంగళవారం వేరే రాష్ట్రానికి వెళ్లడం కోసం చెన్నై విమానాశ్రయానికి వచ్చారు. అయితే అక్కడ ఆమెకు తీవ్ర ఇబ్బంది కలిగింది. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఖుష్బు. అంతేకాక ఎయిర్ ఇండియా సంస్థపై అసహనం వ్యక్తం చేశారు.
కాలికి గాయం అయినా సరే.. ఖుష్బు తన ప్రయాణం మానుకోలేదు. ఈ క్రమంలో ఆమె కాలి గాయంతోనే మంగళవారం చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెబుతూ..‘‘వీల్ చైర్ కావాలని ఎయిర్పోర్ట్ సిబ్బందిని కోరాను. 30 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత.. వేరే విమానయాన సంస్థ వద్ద నుంచి తెచ్చిన వీల్చైర్లో నన్ను పంపించారు. అరగంట పాటు నేను కాలు నొప్పిని భరిస్తూనే ఎదురు చూశాను. ఎయిర్ ఇండియా సంస్థకు ఒక వీల్చైర్ ఏర్పాటు చేసేంత ఆర్థిక స్థోమత కూడా లేదా’’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఖుష్బు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.
Dear @airindiain you do not have basic wheelchair to take a passenger with a knee injury. I had to wait for 30mnts at chennai airport with braces for my ligament tear before they could get a wheelchair borrowed from another airline to take me in. I am sure you can do better.
— KhushbuSundar (@khushsundar) January 31, 2023
కాగా ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా విమాన సంస్థ యాజమాన్యం స్పందించింది. జరిగిన పొరపాటుకు ట్విట్టర్ వేదికగా ఖుష్బుకు క్షమాపణ తెలిపింది. ‘‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము.. ఈ విషయాన్ని చెన్నై విమాన నిర్వాహకులకు తెలియజేస్తాం అని తెలిపింది. అయితే ఈ మధ్య కాలంలో విమానాశ్రయాల్లో ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. మరి ఖుష్బుకు ఎదురైన అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.