దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బీహార్లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్ కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్ బంధువు ఓం ప్రకాష్ సోదరి అంత్యక్రియలకు బంధువులందరు హాజరయ్యారు. అనంతరం మంగళవారం ఉదయం కారులో 10 మంది తిరిగి పాట్నాకు బయల్దేరారు.
పాట్నా నుంచి తిరిగి వస్తున్న సమయంలో లఖిసరాయ్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న సుమో ఓ ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమో నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరణించిన వారిలో సుశాంత్ మేనల్లుడు సహా బావ, హర్యానా కేడర్ ఐపీఎస్ ఓం ప్రకాశ్ సింగ్ సమీప బంధువులు ఉన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ధోని చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం అభిమానులు అతని కుటుంబ సభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. మరోసారి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.