తెలుగు సినిమా కీర్తి ఈరోజు ఖండాంతరాలు దాటి.., పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ కి చేరుకుంది అంటే అది మన బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ కష్టమే. ఒక ప్రాంతీయ హీరోగా మొదలు పెట్టి జాతీయ స్థాయి హీరోగా ఎదిగిన ప్రభాస్ బయోగ్రఫీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభాస్.. 1979 అక్టోబర్ 23న ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివకుమారి దంపతులకు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు. ప్రభాస్ కు అన్నయ్య ప్రభోద్, చెల్లెలు ప్రగతి ఉన్నారు. ప్రభాస్ వెండితెర పరియచం పెదనాన్న కృష్ణంరాజు గారి ద్వారా జరిగింది. అప్పట్లో కృష్ణంరాజు కు ఉన్న రెబల్ స్టార్ బిరుదు ఈ జనరేషన్ లో ప్రభాస్ కు వచ్చింది. 2002 నవంబర్ 11న రిలీజ్ అయిన ఈశ్వర్ మూవీతో ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అశోక్ కుమార్ నిర్మాతగా జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో ఈశ్వర్ చిత్రం తెరకెక్కింది. 2003లో విడుదలైన రాఘవేంద్ర సినిమా ఫ్లాపయినా.., తర్వాత ఎమ్మెస్ రాజు నిర్మాతగా శోభన్ డైరెక్షన్ లో విడుదలైన వర్షం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే ప్రభాస్ హీరోగా సెటిల్ అయ్యాడు.
ఇదీ చదవండి: అయిదు సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్న రెబల్స్టార్ ప్రభాస్
2005 సెప్టెంబర్ 30 తేదీన విడుదలైన ఛత్రపతి సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ ని అమాంతం మార్చేసింది. బి.వి.ఎస్ నిర్మాతగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. 12.50 కోట్లతో నిర్మించిన సినిమా 30 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. 2006 నుండి 2010 వరకు ప్రభాస్ కు అంతగా కలసి రాలేదని చెప్పుకోవచ్చు. ఈ నాలుగేళ్లలో విడుదలైన పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ వంటి సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయాయి. 2010 ఏప్రిల్ 10న విడుదలైన డార్లింగ్ ప్రభాస్ కి చాలా కాలం తర్వాత మంచి హిట్ మూవీగా నిలిచింది. ఆ తరువాత 2011లో విడుదలైన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అప్పటి వరకు ప్రభాస్ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. 2013 ఫిబ్రవరి 8ని ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. ఆ రోజే మిర్చి మూవీ విడుదలైంది. అప్పటి వరకు క్లాస్ లుక్ లో కనిపిస్తూ వచ్చిన ప్రభాస్ లోని మాస్ యాంగిల్ ని బయటకు తీసింది ఈ సినిమానే. దర్శకుడిగా కొరటాల శివ మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.
2013లో మిర్చి సక్సెస్ తరువాత ప్రభాస్ ఇండస్ట్రీ తలరాతని మార్చేసే నిర్ణయం తీసుకున్నారు. అదే బాహుబలికి ఓకే చెప్పడం. మరో సినిమాకి కమిట్ కాకుండా బాహుబలి కోసమే బల్క్ గా డేట్స్ ఇచ్చేశాడు ప్రభాస్. సుమారు మూడేళ్ళ గ్యాప్ తరువాత “బాహుబలి ది బిగినింగ్” ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సుమారు రూ.180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఓవరాల్ రన్ లో రూ.650 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరించింది. ఇదే.. గొప్ప అనుకుంటే బాహుబలి-2 ఊహలకి సైతం అందని రికార్డ్స్ నెలకొల్పింది. 2017 ఏప్రిల్ 18న విడుదలైన “బాహుబలి-2” ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటింది. రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన “బాహుబలి కంక్లూజన్” సుమారు రూ.2000 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్: చరిత్రను తిరగరాస్తా మంటూ బాబర్ ఆజమ్ ప్రగల్భాలు
ఈ దెబ్బతో ఇండియన్ సినీ హీరోలు అంతా ప్రభాస్ కి సాహో అనేశారు. 2019లో ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా విడుదలైన సాహో ప్రేక్షకులను ఆసించిన మేర ఆకట్టుకోలేకపోయింది. కానీ.., ప్రభాస్ క్రేజ్ తోనే ఆ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.430 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి అంతా పోటీ పడుతున్నారు. కానీ.., మన బాహుబలి మాత్రం తన స్థాయికి తగ్గ ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకి పోతున్నాడు. ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. రాధేశ్యామ్ తరువాత.. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే, స్పిరిట్ సినిమాలు క్యూలో ఉన్నాయి. చూశారు కదా? ఇది ప్రభాస్ బయోగ్రఫీ. తెలుగు సినిమా తలరాతని మార్చేసిన మన బాహుబలి స్టార్ కి సుమన్ టీవీ తరుపు నుండి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.