గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. న్యూఇయర్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. 783 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. జనవరి 18 నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలో గ్రూప్- 3కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా కమిషన్ విడుదల చేయనుంది.
కాగా, రాష్ట్రంలో ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో 503 గ్రూప్-1, 9,168 గ్రూప్-4, 16614 యూనిఫార్మ్ సర్వీస్ ఉద్యోగాలున్నాయి. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పూర్తికాగా.. అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.ఇక గ్రూప్-4 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఈనెల 28న ప్రారంభంకావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో డిసెంబర్ 30కి వాయిదా వేసింది. ఇక యూనిఫార్మ్ సర్వీస్ ఉద్యోగాల ప్రక్రియలో ఫిజికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మరోవైపు.. హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో కూడా కొలువుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. మొత్తంగా తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది అని చెప్పాలి. ఉద్యోగాలు సాధించడానికి నిరుద్యోగులకు ఇదొక సువర్ణావకాశం.