ప్రేమిస్తున్నానంటూ నటించి లైంగికంగా లోబర్చుకుని గర్భవతిని చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గట్టిగా నిలదీస్తే తూతూమంత్రంగా పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ కొన్ని రోజులకు వదిలేసి ఇంటికి చేరుకున్నాడు. ఇప్పుడా యువతి తనకు న్యాయం చేయాలని మోసం చేసిన వ్యక్తి ఇంటి ముందు నిరసనకు దిగింది. ఈ ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలోని బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్లో చోటుచేసుకుంది.
జనగాం జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ప్రణీతకు గత ఐదు సంవత్సరాలుగా ప్రశాంత్తో పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి యువతిని ఎనిమిది నెలల గర్భవతిని చేశాడు. అయితే ప్రియురాలిని మోసం చేసి శ్రీజ అనే మరో అమ్మాయిని ప్రశాంత్ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని ప్రియురాలు గట్టిగా నిలదీయడంతో ఈనెల 3వ తేదీన మిర్యాలగూడ తీసుకెళ్లి ఒక గదిలో పెళ్ళి చేసుకున్నాడు.
అంతలోనే తనకు చెప్పాపెట్టకుండా మిర్యాలగూడ నుంచి ఇంటికి వచ్చేశాడని, ఇదేంటని ప్రశ్నిస్తే అతని తల్లి దండ్రులు ప్రశాంత్ను దాచిపెట్టి తమను ఏం చేసుకుంటారో చేసుకో పొమ్మంటున్నారని వాపోయింది. తనకు న్యాయం చేసే వరకూ ఊరుకునేది లేదని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను పీఎస్కు తరలించారు.