ప్రస్తుతం దేశంలో నగదురహిత లావాదేవీలు జోరందుకున్నాయి. ప్రతి చిన్న అవసరానికి నగదుతో పనిలేకుండా ఆన్ లైన్ చెల్లింపులు చేస్తున్నారు. వ్యాపారులు, దుకాణదారులు కూడా ఆన్ లైన్ చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
నగదురహిత లావాదేవీల గురించి అందరికీ తెలిసిందే. ప్రజలను డిజిటల్ చెల్లింపులవైపు మళ్లించేందుకు కేంద్రం కూడా ఎంతో కృషి చేస్తోంది. ఇప్పటికే దేశంలో యూపీఐ పేమెంట్స్ జోరందుకున్నాయి. బయటకు వెళ్తూ కేవలం ఫోన్ జేబులో పెట్టుకుని వెళ్లిపోతున్నారు. రూ.10 కూడా ఆన్ లైన్ లోనే చెల్లిస్తున్నారు. అయితే ఈ యూపీఐ చెల్లింపులు కేవలం దేశంలో మాత్రమే చేసేందుకు వీలుంటుంది. విదేశాల్లో మనం ఇప్పుడు వాడుతున్న ఆన్ లైన్ చెల్లింపులు పనిచేయవు. అయితే ఫోన్ పే తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు విదేశాల్లో కూడా మనం యూపీఐ చెల్లింపులు చేయచ్చు. కాకపోతే ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది.
యూపీఐ చెల్లింపుల గురించి అందరికీ తెలిసిందే. ఈ డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్ పే కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త కూడా చెప్పింది. నిజానికి విదేశాలకు వెళ్లినప్పుడు మీరు అక్కడ ఉపయోగించే కరెన్సీని తీసుకుని వాడుకోవాలి. లేదా మీ నగదుని ఒక కార్డులోకి మార్చుకుని ఆ కార్డని వాడుకోవాల్సి ఉంటుంది. మన బ్యాంకు ఖాతాలు లింక్ చేసిన యూపీఐ అకౌంట్ నుంచి చెల్లింపులు చేయడం సాధ్యం కాదు. ఇక విదేశాల్లో కూడా ఫోన్ పే ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే అవకాశం తీసుకొచ్చింది. దేశంలోనే ఈ సర్వీస్ తీసుకొచ్చిన తొలి సంస్థగా తాము రికార్డు సృష్టించినట్లు ఫోన్ పే ప్రకటించింది.
విదేశాల్లో ఉన్నప్పుడు భారతీయ బ్యాంకు ఖాతాను లింక్ చేసిన ఫోన్ పే ఖాతా నుంచి మీరు డిజిటల్ చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ సదుపాయాన్ని కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం చేసినట్లు చెబుతున్నారు. ముందుగా యూఏఈ, మారిషస్, సింగపూర్, నేపాల్, భూటాన్ లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే పర్యాటకులుగా ఈ దేశాల్లో పర్యటించే వారికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. సమయానికి విదేశీ కరెన్సీ మీ దగ్గర లేకపోతే.. ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. అక్కడి కరెన్సీ కోసం ఫారెన్ ఎక్స్ ఛేంజ్ సెంటర్ల కోసం వెతుక్కోవడం, వారికి కమీషన్లు కట్టే బాధ తప్పుతుందనె చెప్పాలి. అయితే ఇది ఎప్పుడు అమలులోకి వస్తుందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.