వేధింపులు, కలహాలు, అసంతృప్తి కారణం ఏదైనా కొందరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయంతో మొత్తం కుటుంబమే ఛిన్నాభిన్నం అవుతోంది. అలా వనపర్తి జిల్లాలో ఓ వివాహిత తీసుకున్న నిర్ణయం మొత్తం కుటుంబాన్ని శోకసంద్రంలోని నెట్టేసింది. ముగ్గురు పిల్లలతో కలిసి ఓ మహిళ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పిడింది. వారిలో ఒక మూడేళ్ల బాలుడిని స్థానికులు రక్షించారు.
వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెబ్బేరుకు చెందిన భవ్య.. తన ముగ్గురు చిన్నారులతో సహా జూరాల కాల్వలో దూకింది. అక్కడున్న స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. వారిలో మూడేళ్ల బాబును కాపాడగలిగారు. భవ్య, జ్ఞానేశ్వరి(5), నిహారిక(ఏడాది)ని మాత్రం కాపాడలేకపోయారు. భవ్య ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణంగా స్థానికులు చెబుతున్నారు. భవ్య, చిన్నారుల మృతితో పెబ్బేరులో విషాద ఛాయలు అలముకొన్నాయి.