రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లన్నీ పతనం దిశగా సాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సూచీలు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు రూ.10 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా పడిపోతూ చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 1800 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. 55 వేల 997 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో 2,850 పాయింట్లు పతనమై 54 వేల 383 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగాల్సిందిగా భద్రతా బలగాలకు ఆదేశాలిచ్చాడు. రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా చర్యలకు ప్రతిచర్య తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగి.. యుద్ధం మొదలవ్వడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. ప్రపంచంలో రెండు అగ్రరాజ్యల (పరోక్షంగా అమెరికా) మధ్య జరుగుతున్న యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక మదుపరులు తమ పెట్టబడులు వెనక్కి తీసుకున్నారు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై భారీగానే కనిపించింది. దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, నాటో దళాలు ప్రతిచర్యలకు దిగితే మార్కెట్లు మరింత పడిపోయే అవకాశం ఉంది.చివరకి, సెన్సెక్స్ 2,702 పాయింట్ల నష్టంతో (4.72%) క్షీణించి 54,529.91 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 815.30 పాయింట్లు పతనమై (4.78%) నష్టపోయి 16,248.00 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.70 వద్ద ముగిసింది. ఈ రోజు నిఫ్టీ, సెన్సెక్స్లో ఏ ఒక్క షేరు కూడా లాభపడలేదు. నిఫ్టీలో 50కి 50 కంపెనీల షేర్లు నష్టపోయాయి. ఇక రంగాల వారిగా చూస్తే అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ 10 శాతానికి పైగా పడిపోయింది. యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రేసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఐఆర్సీటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 శాతానికిపైగా డీలాపడ్డాయి. క్రూడాయిల్ పెరుగుదల ప్రభావంతో ఆయిల్, గ్యాస్ కంపెనీలైన గుజరాత్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్, పెట్రోనెట్ ఎల్ ఎన్ జి, బీపీసీఎల్, గెయిల్ ఇండియా.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖ కంపెనీల షేర్లన్నీ డీలా పడ్డాయి.