90వ దశకం.. క్రికెట్ ప్రపంచాన్ని ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ లాంటి జట్లు ఏలుతున్న కాలం. అప్పటికి శ్రీలంక జట్టు పసికూన కింద లెక్కే.
అప్పుడే జట్టులోకి వచ్చాడు 18 ఏళ్ల కుర్రాడు. చూడ్డానికి బొద్దుగా, గుండ్రాయిలాగా నున్నగా ఉన్నాడు. అయితే అందరిలాగానే జట్టులోకి వస్తాడు.. అందరిలాగే వెళ్లిపోతాడు అనుకున్నారు క్రికెట్ నిపుణులు.
శ్రీలంక టీమ్ కు 1996లో ఏకంగా ప్రపంచ కప్ ను అందించిన ఘనత అతడి సొంతం. అలా శ్రీలంక క్రికెట్ చరిత్ర గతినే మార్చిన ఆ ఒకే ఒక్కడి పేరు అర్జున్ రణతుంగ.
టీమిండియాలో గంగూలీ, ధోనిలు తీసుకొచ్చిన సంస్కరణలను అర్జున్ రణతుంగ 90ల్లోనే తీసుకొచ్చాడు.
తన తొలి టెస్టు మ్యాచ్ లోనే అర్దశతకం సాధించి.. ఈ ఘనత సాధించిన శ్రీలంక తొలి క్రికెటర్ గా నిలిచాడు.
ఇమ్రాన్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, వసీం అక్రమ్ లాంటి భయంకర బౌలర్లను ఎదుర్కొంటూ.. 4వ వికెట్ కు అసంక గురుసిన్హతో కలిసి అభేద్యమైన 240 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించాడు.
1986 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై 57 రన్స్ చేసి శ్రీలంక కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
1988లో కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాడు. ఎప్పుడైతే రణతుంగ సారథిగా పగ్గాలు అందుకున్నాడో టీమ్ లో సమూల మార్పులు తీసుకొచ్చాడు.
వీలైనంత త్వరగా తొలి 15 ఓవర్లలో భారీగా పరుగులు చేయాలని, ఇదే తన విజయ రహస్యంగా చెప్తాడు రణతుంగ.
అతడు కెప్టెన్ గా విజయవంతం అయ్యాడు అనడానికి 1996 వరల్డ్ కప్, 1997 ఆసియా కప్ లను శ్రీలంక గెలుచుకోవడమే నిదర్శనం.
ఇప్పుడైతే అందరు ధోని.. ధోని అంటున్నారు గానీ, ధోని వ్యూహాలన్నీ 90ల్లోనే రణతుంగ వాడిపడేశాడు.
రిటైర్మెంట్ తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డులో అనేక హోదాల్లో పదవులు నిర్వహించాడు. అనంతరం రాజయకీయ రంగ ప్రవేశం చేసి ప్రజాసేవకుడిగా మంచి పేరుతెచ్చుకున్నాడు.
తన వ్యూహ, ప్రతివ్యూహాలతో పసికూనలాగ ఉన్న శ్రీలంక ను క్రికెట్ ప్రపంచంలో సింహంలా చేసింది మాత్రం అర్జున్ రణతుంగానే.